భారత్ లో కరోనా.... భయపడాల్సిన అవసరం లేదన్న మోదీ

  • దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్న మోదీ
  • జ్వరం, దగ్గు వస్తే నిర్లక్ష్యం చేయరాదని స్పష్టీకరణ
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దసంఖ్యలో అనుమానితులు ఆసుపత్రులకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానించారు. భయపడాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. సమష్టిగా కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఇదేనని ట్వీట్ చేశారు. కరోనాను నివారించడానికి చిన్నవైనా, అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.

తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, బయటికి వెళ్లినప్పుడు ఇతర వ్యక్తులకు వీలైనంత ఎడంగా ఉండడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. పదేపదే కళ్లు నులుముకోవడం, ముక్కు, నోటి వద్ద చేతులు ఉంచుకోవడం చేయరాదని, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డంపెట్టుకుని దగ్గాలని, జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వైద్యచికిత్స తీసుకోవాలని సూచించారు. వైద్యనిపుణుల సలహాలను తప్పకుండా పాటించాలని మోదీ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.

Narendra Modi
Corona Virus
India
Precautions

More Telugu News